Mohanbabu: ఆస్తులు తాకట్టు పెట్టి విద్యాసంస్థలు నడిపిస్తున్నా: మోహన్ బాబు

  • ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ కావడం లేదు
  • రెండేళ్ల బకాయిలు చెల్లించాల్సివుంది
  • విద్యాసంస్థల నిర్వహణలో ఇబ్బంది పడుతున్నామన్న మోహన్ బాబు

తాము ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, రుణాలను తీసుకుంటూ విద్యా సంస్థలను నడిపించాల్సి వస్తోందని సినీ నటుడు మోహన్ బాబు తన ఆవేదనను వ్యక్తం చేశారు. శ్రీ విద్యానికేతన్‌ పేరిట విద్యాసంస్థలను నడుపుతున్న ఆయన, చంద్రగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ను విడుదల చేయడంలో సర్కారు తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు.

 2017–18, 2018–19 విద్యాసంవత్సరాలకు గాను, ప్రభుత్వం నుంచి తమకు రూ. 20 కోట్లు రావాల్సివుందన్నారు. రెండేళ్లు దాటినా బకాయిలను చెల్లించకపోవడంతో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కాలేజీ నిర్వహణ నిమిత్తం నెలకు రూ. 6 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోందని, ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోయినా, తాము అధ్యాపకులు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందిస్తున్నామని అన్నారు. గడచిన 26 ఏళ్లుగా విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, ఈ విషయంలో రాజీ పడేది లేదని మోహన్ బాబు వ్యాఖ్యానించారు.

More Telugu News