YSRCP: ఆంధ్రాలో దమ్మున్న నేతలు, తెలంగాణలో దద్దమ్మ నాయకులు: ఏపీ మంత్రి జవహర్

  • వైసీపీ నేతలు కేసీఆర్ ముసుగేసుకుని రావాలి
  • జగన్ వస్తే బీసీ కులాలు జనరల్ కేటగిరీలోకి
  • మీడియాతో మాట్లాడిన టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్న నేతల నాయకత్వం నడుస్తుండగా, తెలంగాణలో దద్దమ్మల నాయకత్వం నడుస్తోందని మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. ఇటీవలి గడ్కరీ పర్యటనను ప్రస్తావిస్తూ, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి అమరనాథరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీసీ కులాలను జనరల్ కేటగిరీలోకి మార్చారని, ఏపీలో జగన్ ప్రభుత్వం వస్తే, ఇదే అన్యాయం బడుగులకు జరుగుతుందని అన్నారు.

రాష్ట్రానికి వారాలబ్బాయిలు ఎక్కువయ్యారని, ఈ వారం అబ్బాయి గడ్కరీ వచ్చి పోయారని, వచ్చేవారం ఇంకో అబ్బాయి వస్తాడని ఇదే సమావేశంలో పాల్గొన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నరేంద్ర మోదీ, కేసీఆర్ ల ముసుగులు వేసుకుని ప్రజల్లోకి రావాలని అమరనాథరెడ్డి వ్యాఖ్యానించారు. తమపై విమర్శలు చేస్తున్న సోము వీర్రాజు కనీసం తన స్వగ్రామంలో వార్డు మెంబర్ గా కూడా గెలవలేడని చినరాజప్ప ఎద్దేవా చేశారు.

More Telugu News