Telugudesam: మతిభ్రమించే ఆ పిచ్చి ప్రేలాపనలు: మేడాపై ఆదినారాయణ రెడ్డి ధ్వజం

  • టీడీపీకి రాజీనామా చేసిన మేడా
  • తండ్రికి టీటీడీ సభ్యుడిగా పదవిని తీసుకోలేదా?
  • ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరన్న మంత్రి

రాజంపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత మేడా మల్లికార్జున్‌ రెడ్డి, తన పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. తనకిప్పుడు గంజాయి వనం నుంచి తులసి వనంలోకి వచ్చినట్టు ఉందని మేడా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, తండ్రికి టీటీడీ సభ్యుడిగా పదవిని  తీసుకున్న వేళ, 'టీడీపీ ఓ గంజాయి వనం' అన్న విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.

లోటస్‌ పాండ్ ను తులసివనమని చెబుతున్న మేడాకు మతిభ్రమించి, పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని నిప్పులు చెరిగారు. రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో నిధులను తీసుకున్న మల్లికార్జున్‌ రెడ్డి, ఇప్పుడు పార్టీని వదిలేసి, చంద్రబాబు ఏం చేయలేదంటూ ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న ఆయన్ను ప్రజలు క్షమించరని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననడం అయిపోయిన పెళ్లికి మేళం వంటిదేనని విమర్శించారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసం కేంద్రంతో లాలూచీ పడ్డ జగన్ తో ఆయన కలిశారని మండిపడ్డారు.

More Telugu News