modi: 85 శాతం దోపిడీని అడ్డుకున్నాం: మోదీ

  • అవినీతిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు
  • నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 5.80 లక్షల కోట్లను ప్రజల అకౌంట్లలోకి వేశాం
  • భారత్ ఎప్పటికీ మారదు అనే అభిప్రాయాన్ని మార్చాం

అవినీతికి అడ్డుకట్ట వేయడానికి దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ప్రధాని మోది విమర్శించారు. 15వ ప్రవాసీ భారతీయ దినోత్సవం సందర్భంగా వారణాసిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల తమ పాలనలో 85 శాతం అవినీతికి అడ్డుకట్ట వేశామని చెప్పారు.

 దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ పేరును ప్రస్తావించకుండా... 'రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి' అన్న ఆయన మాటలను మోదీ లేవనెత్తారు. ఈ లీకేజీని అరికట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం కృషి చేయలేదని దుయ్యబట్టారు. మధ్య తరగతి ప్రజలు ఎంతో నిజాయతీగా కట్టిన పన్నుల్లో 85 శాతాన్ని తినేశారని విమర్శించారు.

గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 5.80 లక్షల కోట్లను వివిధ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించామని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుసరించి ఉంటే రూ. 5.80 లక్షల కోట్లలో రూ. 4.50 లక్షల కోట్ల మేర లూటీ జరిగేదని అన్నారు. లూటీ జరగకుండా తాము వ్యవస్థలో మార్పును తీసుకొచ్చామని తెలిపారు.

 ఈ మార్పును కాంగ్రెస్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉండేదని... కానీ, మార్పు తీసుకురావాలన్న ఆలోచన వారికి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలను పొందిన వారిలో 7 కోట్ల మంది ఫేక్ ప్రజలను తాము గుర్తించామని... వాస్తవానికి వీరు ఉండరని, కేవలం రికార్డుల్లో మాత్రమే ఉంటారని చెప్పారు. ఈ ఫేక్ ప్రజల జనాభా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అప్పనంగా దోచుకోవడానికే ఈ ఫేక్ జనాలను పుట్టిస్తారని చెప్పారు.

ఎన్నారైలు భారతదేశ రాయబారులు అంటూ మోదీ కితాబిచ్చారు. 'భారత్ ఎప్పటికీ మారదు' అనే అభిప్రాయాన్ని తాము మార్చామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పోషిస్తున్న పాత్ర చాలా గొప్పదని... ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు.

More Telugu News