Narendra Modi: రాఫెల్ థీమ్ తో వెడ్డింగ్ కార్డు... ప్రత్యేకంగా లేఖను పంపిన ప్రధాని నరేంద్ర మోదీ!

  • శుభలేఖను వినూత్నంగా డిజైన్ చేయించిన గుజరాత్ జంట
  • దాన్ని చూసి ముచ్చటపడిన నరేంద్ర మోదీ
  • కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ లేఖ 

గుజరాత్ కు చెందిన ఓ యువజంటకు వివాహం నిశ్చయమవగా, వారు తమ శుభలేఖను డిజైన్ చేయించుకున్న తీరు చూసి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ముచ్చటపడ్డారు. తమ వెడ్డింగ్ కార్డును రాఫెల్ థీమ్ తో వీరిద్దరూ తయారు చేయించుకోగా, ఈ కార్డును సోషల్ మీడియాలో చూసిన మోదీ, వారిని అభినందిస్తూ లేఖను పంపారు.

సూరత్ కు చెందిన యువరాజ్ పోఖర్ణ, సాక్షి అగర్వాల్ జంటకు నేడు వివాహం జరగనుంది. వీరు 'ప్రశాంతంగా ఉండి నమోను నమ్మండి' అనే టైటిల్ తో రాఫెల్ డీల్ గురించిన వివరాలను తమ వెడ్డింగ్ కార్డులో పెట్టడంతో పాటు, డీల్ దేశానికి మంచిదని అభిప్రాయపడ్డారు. తమ పెళ్లికి వచ్చే అతిథులు రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు.

ఇక దీనిపై మోదీ స్పందిస్తూ, "యువరాజ్, సాక్షిల వివాహం సందర్భంగా పోకర్ణ ఫ్యామిలీకి నా హృదయపూర్వక శుభాభినందనలు. మీ వివాహ శుభలేఖ వినూత్నంగా ఉంది. దేశంపై మీకున్న ప్రేమను చెప్పకనే చెబుతోంది. దేశం కోసం మరింతగా శ్రమించాలని నాకు గుర్తు చేస్తోంది" అని పేర్కొన్నారు. వారిద్దరి జీవితాలూ బాగుండాలని తాను కోరుకుంటున్నానని మోదీ ఆకాంక్షించారు. 

More Telugu News