Chandrababu: వంగవీటి రాధాకు ఎమ్మెల్యే టికెట్ కాదు... ఎమ్మెల్సీ మాత్రమే ఆఫర్ చేసిన చంద్రబాబు!

  • వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా
  • 25న టీడీపీలో చేరనున్న రాధ
  • దేవినేని అవినాష్ కు అన్యాయం జరగబోదని హామీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైన వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగేందుకు ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చే పరిస్థితులు లేవని, అయితే, ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రాధాను పార్టీలోకి చేర్చుకునే విషయమై విజయవాడ ముఖ్య నేతలు బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర తదితరులతో చర్చలు జరిపిన చంద్రబాబుకు, ఎమ్మెల్యే టికెట్ ను రాధకు ఆఫర్ చేస్తే వచ్చే ఇబ్బందుల గురించి నేతలు వివరించారు. ఆపై చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు. ఇక ఇదే సమావేశానికి వచ్చిన తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్, రాధాను ఆహ్వానించడంపై అభ్యంతరం తెలిపారు.

రాధా వస్తే, తనకు అన్యాయం జరుగుతుందని అవినాష్ ఆరోపించగా, అవినాష్ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేకుండా చూస్తానని, ఓ యువనేతగా మంచి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు సర్ది చెప్పినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News