Aditya Pancholi: కారు మరమ్మతు బిల్లు రూ.2.8 లక్షలు.. అడిగినందుకు చంపేస్తానన్న బాలీవుడ్ నటుడు

  • కారు మరమ్మతు చేయించుకున్న ఆదిత్య పంచోలీ
  • డబ్బులు అడిగితే చంపుతానని బెదిరింపు
  • ఆరోపణలు అబద్ధమన్న పంచోలీ

కారు మరమ్మతు చేయించుకున్న బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి డబ్బులు అడిగినందుకు చంపేస్తానని మెకానిక్‌ను బెదిరించాడు. దీంతో అతడు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన కార్ మెకానిక్ మోసిన్ కాదర్ రాజప్‌కర్‌కు ఆదిత్య పంచోలీతో వ్యక్తిగత పరిచయం ఉంది.

మార్చి 10, 2017న మోసిన్‌కు ఫోన్ చేసి తన ల్యాండ్ క్రూయిజర్ కారును మరమ్మతు చేసేందుకు తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. అదే ఏడాది మేలో ఇంటికొచ్చి కారును పరీక్షించిన మోసిన్ దానిని జుహులోని ఓ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అయితే, దానికి సంబంధించిన కొన్ని విడిభాగాలు దొరక్కపోవడంతో దానిని ఢిల్లీకి తరలించాడు. దానిని పూర్తిగా బాగు చేసిన అనంతరం గతేడాది ఫిబ్రవరిలో దానిని తిరిగి ముంబైకి పంపించాడు. కారు మరమ్మతు మొత్తం ఖర్చు రూ. 2.80 లక్షలు అయింది.

కారు తన ఇంటికి చేరిన తర్వాతి నుంచి పంచోలీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. మరమ్మతు డబ్బులు అడిగితే ఇవ్వకపోగా, బూతులు తిడుతూ చంపుతానని మెకానిక్‌ను బెదిరించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే, మెకానిక్ ఆరోపణల్లో నిజం లేదని పంచోలీ పేర్కొన్నాడు. ఎటువంటి కారణం లేకుండానే తన కారును ఏడాదిపాటు ఉంచుకున్నాడని అన్నాడు. అతడికి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేశానని, ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు జరుగుతోంది.

More Telugu News