Uttar Pradesh: మొదటి పెళ్లిని దాచిపెట్టి మరో పెళ్లి... డబ్బు, నగలతో మొదటి భర్తతో పరార్!

  • యూపీలోని లక్నోలో ఘటన
  • ఏడాది క్రితం మొదటి పెళ్లి, దాన్ని దాచి మరో పెళ్లి
  • ఢిల్లీ మీదుగా థాయ్ ల్యాండ్ పారిపోయిన యువతి

వైభవంగా పెళ్లి జరిగిందన్న ఆనందం ఆ యువకుడికి మూన్నాళ్ల ముచ్చటే అయింది. వివాహం తరువాత భార్యను ఇంటికి తీసుకుని వచ్చిన 13వ రోజే ఆమె నగలు, నగదు, విలువైన గిఫ్ట్ లను తీసుకుని తన మొదటి భర్తతో కలిసి థాయ్ లాండ్ పారిపోయింది. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌, లక్నో పరిధిలోని వికాస్‌ నగర్ లో జరిగింది.

సార్థక్ పాండ్యా అనే యువకుడికి  గోరఖ్‌ పూర్‌ ప్రాంతానికి చెందిన అర్పతా చతుర్వేదితో గత సంవత్సరం చివర్లో వివాహమైంది. పెళ్లయిన 13వ రోజున పుట్టింటికి వెళ్లొస్తానని చెబుతూ, పెళ్లికి వచ్చిన బహుమతులను నగలను, డబ్బును తీసుకుని వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తన సహోద్యోగి అయిన నిమేష్ నిశ్చల్‌ తో ఢిల్లీ మీదుగా థాయ్‌ ల్యాండ్ వెళ్లిపోయిందని, ఏడాది క్రితమే ఆమెకు, నిమేష్ కు పెళ్లయిందని తెలుసుకున్న పాండ్యా అవాక్కయ్యాడు.

తనను మోసం చేశారంటూ భార్య, ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి నుంచి రూ. 4 లక్షల విలువైన నగలు, డబ్బును ఆమె తీసుకెళ్లిందని పేర్కొన్నాడు. పాండ్యా ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News