Andhra Pradesh: వైకాపాను వదిలేసేందుకు చాలా మంది రెడీ: మంత్రి ప్రత్తిపాటి

  • ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేసేందుకు మోదీతో కలిసి జగన్ కుట్ర
  • రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవారు వైసీపీలో ఉండరు
  • మీడియాతో ప్రత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్ ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వైఎస్ జగన్ కుట్రను పన్నారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ విధానాలు నచ్చని ఎంతో మంది ఆ పార్టీని వీడి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వారు ఎవరూ వైకాపాలో ఉండేందుకు ఇష్టపడటం లేదని అన్నారు.

చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఆడ్రస్ కూడా కనిపించదని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. కోల్ కతాలో జరిగిన ర్యాలీని చూసిన తరువాత నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని, ఆయనది ప్రచార ఆర్భాటమేగానీ, అభివృద్ధి కనిపించడం లేదని అన్నారు. నోట్ల రద్దు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తదితరాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, మోదీ కుట్రలను ప్రజలకు వివరించేందుకే ధర్మ పోరాట దీక్షలను చేస్తున్నామని తెలిపారు.

More Telugu News