KCR: కేసీఆర్‌కు ఫ్రంట్ పేరుతో ఓట్లు చీల్చాలన్న ఆలోచన తప్ప.. ప్రజల విషయంలో బాధ్యత లేదు: కళా వెంకట్రావు

  • పోలవరం నిర్మాణానికి నిధుల సమస్య
  • డ్వాక్రా మహిళలకు మరో రూ.10 వేలు
  • 10 శాతం రిజర్వేషన్ అంశంపై ఆలోచిస్తున్నాం

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫ్రంట్ పేరుతో ఓట్లు చీల్చాలనే ఆలోచన తప్ప.. ప్రజల విషయంలో బాధ్యతనేదే లేదని ఏపీ మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోల్‌కతా సభకు ఆహ్వానం ఉన్నా కేసీఆర్ రాకపోవడాన్ని తప్పుబట్టారు. కేంద్ర సహకారం లేకపోవడంతో పోలవరం నిర్మాణానికి నిధుల సమస్య వెంటాడుతోందని.. వెంటనే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

రైతుకు పెట్టుబడి సాయం కింద లబ్ది చేకూర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని తెలిపారు. డ్వాక్రా మహిళలకు మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్టు కళా తెలిపారు. అగ్రకులాల్లోని ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ అంశంపై ఆలోచిస్తున్నామని.. కాపు రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఇందులో పొందుపరచాలనే యోచనలో ఉన్నట్టు కళా స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ మొత్తాలను చెల్లిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

More Telugu News