Andhra Pradesh: ‘పదో తరగతి పాస్ చేయిస్తా’ అంటూ కరస్పాండెంట్ అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక!

  • ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘటన
  • బాలికపై కరస్పాండెంట్ లైంగికదాడి
  • పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ పాఠశాల కరస్పాండెంట్ మృగాడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. చివరికి విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు రాగా,  సదరు ప్రబుద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో ఉన్న ‘ఎంఆర్ఆర్ ప్రకాశం హైస్కూల్’లో ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. అక్కడే పాఠశాలకు అనుబంధంగా ఉన్న హాస్టల్ లో ఆమె ఉంటోంది. ఈ నేపథ్యంలో సదరు బాలికపై పాఠశాల కరస్పాండెంట్ వీరయ్య కన్నేశాడు. మంచి మార్కులు వచ్చేలా చేస్తాననీ, పాస్ చేయిస్తానని మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక స్కూలుకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.

తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు బంధువులను తీసుకుని పాఠశాల వద్దకు వచ్చారు. ఈ విషయం ఎలాగో ముందుగానే తెలుసుకున్న వీరయ్య.. అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా, కీచక కరస్పాండెంట్ పై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News