BJP: బీజేపీకి కొత్త తలనొప్పి... భారీ షాకిచ్చిన జేడీ(యూ)!

  • సిటిజన్ షిప్ బిల్లునకు మద్దతిచ్చేది లేదు
  • రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటేస్తాం
  • వెల్లడించిన జేడీ (యూ) కార్యదర్శి కేసీ త్యాగి

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీయే సర్కారుకు కొత్త తలనొప్పి మొదలైంది. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్), వివాదాస్పద సిటిజన్ షిప్ బిల్లుకు మద్దతిచ్చేది లేదని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఈ బిల్లుకు తాము వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ త్యాగి స్వయంగా వెల్లడించారు.

ఈ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేయడంతోనే బిల్లు ఆమోదం పొందిందని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో మాత్రం ఈ బిల్లును యథాతథంగా ఆమోదించే ప్రసక్తే లేదని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతరులు, ఆరేళ్ల పాటు ఇండియాలో నివాసం ఉంటే, వారికి పౌరసత్వాన్ని ఇచ్చేలా ఈ బిల్లును రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును పలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు, విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా కేంద్రంలో భాగస్వామిగా ఉన్న జేడీ (యూ) కూడా ఈ బిల్లును వద్దంటుండటం గమనార్హం.

More Telugu News