bhagwant mann: ఇక జీవితంలో మద్యం తాగనని ప్రతిజ్ఞ చేసిన ఎంపీ!

  • అలవాటును వదిలేశానన్న భగవంత్ మాన్
  • కేజ్రీవాల్ సమక్షంలో ప్రకటన
  • మార్పునకు పునాది పడిందన్న ఢిల్లీ సీఎం

ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంగ్రూర్ లోక్ సభ సభ్యుడు భగవంత్ మాన్, తానిక జీవితంలో మద్యం ముట్టబోనని ప్రతిజ్ఞ చేశారు. విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా గతంలో ఎన్నోమార్లు ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా, ఆయన మాట్లాడుతూ, తాను ఎప్పుడో ఓ మారు తాగే వాడినని, అయితే, ప్రతిపక్షాలు మాత్రం తనను లక్ష్యంగా చేసుకుని విమర్శించేవారని అన్నారు.

తాను రాత్రి, పగలు తేడా లేకుండా తాగుతానన్న ప్రచారం జరిగిందని, కొన్ని వీడియోలు పోస్ట్ చేసి, తన పేరు చెడగొట్టే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఆ వీడియోలను చూసినప్పుడు తనకు చాలా బాధ అనిపించిందని, ఇంట్లో తన తల్లి సైతం ఇదే విషయాన్ని చెప్పి బాధపడిందని అన్నారు. వెంటనే అలవాటు మానుకోవాలని ఆమె సలహా ఇచ్చారని, దీంతో తాను జనవరి 1నే ఈ మేరకు ప్రతిజ్ఞ చేసుకున్నానని చెప్పారు.

 ఇప్పుడు అదే విషయాన్ని సీఎం కేజ్రీవాల్ సమక్షంలో బహిరంగంగా ప్రకటిస్తున్నానని అన్నారు. విపక్షాలు ఇక తనను టార్గెట్ చేసుకోవడాన్ని మానివేయాలని భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు. కాగా, మాన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అరవింద్ కేజ్రీవాల్, ఆయన మార్పునకు పునాది వేశారని కొనియాడారు.

More Telugu News