India: మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ దంపతులపై దొంగల దాడి!

  • న్యూఢిల్లీలో ఘటన
  • మాల్ ను సందర్శించి వస్తున్న ప్రభాకర్ జంట
  • ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాగ్వాదం, దాడి

టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ తన భార్య, బాలీవుడ్ నటి ఫర్హీన్ తో కలసి కారులో వెళుతున్న వేళ, కొందరు దుండగులు దాడి చేసి ఫర్హీన్ మనీ పర్సు, స్మార్ట్ ఫోన్ ను దోచుకెళ్లారు. పోలీసులు, మనోజ్ ప్రభాకర్ వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, న్యూఢిల్లీలోని సర్వప్రియ విహార్ ప్రాంతంలో ఉన్న సెలెక్ట్ సిటీ వాక్ మాల్ సందర్శనకు వెళ్లిన ఈ జంట తిరిగి కారులో వెళుతుండగా, ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నలుగురు అటకాయించారు.

ఆమె డ్రైవింగ్ బాగా చేయడం లేదంటూ వాదనకు దిగారు. అడ్డుకోబోయిన ప్రభాకర్ పై దాడి చేశారు. ఆస్థమాతో బాధపడుతున్న ప్రభాకర్ రోడ్డుపై పడిపోగా, ఫర్హీన్ పర్స్ ను, స్మార్ట్ ఫోన్ ను లాక్కెళ్లారు. ఓ ఆర్మీ అధికారి సాయంతో కోలుకున్న మనోజ్ ప్రభాకర్, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్స్ లో రూ. 16 వేల రూపాయలు, కొన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News