Hyderabad: గొలుసు దొంగపై సివంగిలా దూకిన మహిళ... దెబ్బకు పరార్!

  • హైదరాబాద్, అత్తాపూర్ లో ఘటన
  • షాపు తెరిచేందుకు వచ్చిన మహిళ
  • దొంగపై రాయితో దాడి
  • ధైర్యాన్ని అభినందించిన పోలీసులు

తన మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లేందుకు వచ్చిన దొంగను హైదరాబాద్ కు చెందిన మహిళ చాకచక్యంగా ఎదుర్కొని ప్రశంసలు అందుకుంటోంది. ఆమె చూపిన ధైర్యాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన పోలీసులు సైతం ఆమెను అభినందించారు. ఈ ఘటన రాజేంద్రనగర్‌, సమీపంలోని అత్తాపూర్‌, వాసుదేవారెడ్డి నగర్‌ లో జరిగింది. ఇక్కడ ఓ కిరాణ దుకాణం నడుపుకుంటున్న మంజుల అనే మహిళ, ఉదయం 6 గంటల సమయంలో షాపు తీసేందుకు వచ్చిన వేళ, ఈ ఘటన జరిగింది.

 అంతకుముందు రోజే పోలీసులు ఆ ప్రాంతంలో చైన్ స్నాచర్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆ సమయంలో బైకుపై కూర్చుని ఉన్న ఓ వ్యక్తి, తన ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని గమనించింది. అతనిపై అనుమానంతోనే, దుకాణం తెరిచేందుకు సిద్ధమవుతుండగా, వెనుకనుంచి వచ్చిన అతను, మెడలోని గొలుసును లాగబోయాడు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఆమె, వెంటనే తిరగబడింది. పెద్దగా కేకలు పెడుతూ, రాయి తీసుకుని విసిరింది. దీంతో ఆ దొంగ పలాయనం చిత్తగించాడు. ఆ దొంగ ఎవరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News