Hyper aadi: జనసేన సభలో 'జై జగన్' నినాదాలు.. మధ్యలోనే ప్రసంగాన్ని ముగించిన హైపర్ ఆది !

  • చిత్తూరు జిల్లా కందూరులో జనసేన సభ
  • ముఖ్య అతిథిగా వచ్చిన హైపర్ ఆది
  • జగన్ పై విమర్శలు చేయడంతో రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు

చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని కందూరులో జరిగిన జనసేన సభలోకి వైసీపీ కార్యకర్తలు చొచ్చుకు వచ్చి 'జై జగన్‌' అంటూ నినాదాలు చేసిన వేళ, తీవ్ర గందరగోళం, వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. జనసేన, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ సభలో ప్రసంగించేందుకు వచ్చిన హైపర్‌ ఆది, తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది.

ఈ సభకు హాజరైన కొందరు స్థానిక నేతల కథనం ప్రకారం, వైసీపీ అధినేత జగన్‌ పై విమర్శలు చేయడంతో గొడవ ప్రారంభమైంది. వారిని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు ‘జై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో హైపర్ ఆది, తన కారులో రావడంతో కారుపై దాడికి యత్నించారు. జనసేన కార్యకర్తల సాయంతో వేదికపైకి వెళ్లిన ఆయన, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, జనసేన కార్యకర్తలపై దాడులతో గందరగోళం సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పవన్‌ కల్యాణ్ వంటి నిస్వార్థ నేతను ప్రజలు ఎన్నుకోవాలని, అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఆయన కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. హైపర్ ఆది ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ కార్యకర్తలు అడ్డుతగలడంతో, ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించగా, విషయం తెలుసుకుని వచ్చిన పోలీసులు ఆదిని మరో మార్గం గుండా తిరుపతి రహదారిపైకి చేర్చారు.

More Telugu News