Krishna District: తమ సామాజిక వర్గమే గొప్పదంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు.. కృష్ణా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

  • మూడు రోజుల క్రితం కొట్టుకున్న యువకులు
  • గ్రామంలో పోలీసుల బందోబస్తు
  • ఆదివారం మరో వర్గాన్ని అడ్డుకున్న ఆందోళనకారులు

తమ సామాజిక వర్గమే గొప్పదంటూ ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిందీ  ఘటన. దీనికి రెండు మూడు రోజుల ముందు గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజులుగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, ఆదివారం ఓ వర్గానికి చెందిన యువకులు తమ వర్గమే గొప్పదని పేర్కొంటూ దాడి జరిగిన నాటి వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఇది చూసిన మరో వర్గం వారు ఆగ్రహంతో ఊగిపోతూ కేసరపల్లి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో మరో వర్గానికి చెందిన యువకుడిపై దాడి చేశారు. దీంతో మరోమారు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అదే మార్గంలో వస్తున్న ఆందోళనకారులను తమ కాలనీ దాటి వెళ్లకుండా మరో వర్గం అడ్డుకుంది. సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

More Telugu News