Andhra Pradesh: దోపిడీ దొంగల రాక్షసత్వం.. ఇంటిలో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి మంటపెట్టిన దుండగులు!

  • తీవ్రంగా గాయపడ్డ మహిళ
  • బాధితురాలు గుంటూరు ఆసుపత్రికి తరలింపు
  • కేసు నమోదుచేసిన పోలీస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో మహిళ నుంచి బంగారు నగలను చోరీ చేసిన కొందరు దొంగలు.. సాక్ష్యాలు మిగలకుండా గ్యాస్ సిలిండర్ లీక్ చేసి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇంటి మహిళ తీవ్రంగా గాయపడింది. జిల్లాలోని ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఒంటరిగా ఓ మహిళ ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఆమె ఇంటిపై కన్నేసిన కొందరు దుండగులు ఈరోజు తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం నిద్రపోతున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసులతో పాటు ఇంట్లోని నగలు, నగదును దోచుకున్నారు. ఆ తర్వాత వంటింటిలోని గ్యాస్ సిలిండర్ ను లీక్ చేసి మంట పెట్టి పరారయ్యారు.

ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో బాధితురాలు ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగెత్తింది. దీంతో స్థానికులు ఆమెను వెంటనే గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. ఈ సందర్భంగా బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ లను రంగంలోకి దించామన్నారు. మరోవైపు జీజీహెచ్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. బాధితురాలి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పేర్కొన్నారు.

More Telugu News