Hyderabad: ఆఫీసుకి వెళుతున్నానని ఇంట్లో చెప్పి... మాయమైన హైదరాబాద్ యువతి!

  • 14వ తేదీన అదృశ్యమైన సంధ్యారాణి
  • 11న ఆఫీసులో ఉద్యోగానికి రాజీనామా
  • కేసును విచారిస్తున్న జీడిమెట్ల పోలీసులు

ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పిన ఓ హైదరాబాద్ యువతి, తన ఉద్యోగానికి రాజీనామా చేసి అదృశ్యమైంది. జీడిమెట్ల పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, షాపూర్ నగర్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో పవార్ ప్రకాశ్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.

ఆయన కుమార్తె సంధ్యారాణి (24) గచ్చిబౌలిలోని యూనిసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగిని. ఈ నెల 14వ తేదీన ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి ఇంటిలో నుంచి వెళ్లిన ఆమె, తిరిగి రాలేదు. రాత్రి వరకూ వేచి చూసిన ప్రకాశ్, ఆపై ఆందోళనతో కంపెనీకి వెళ్లి ఆరా తీశారు. సంధ్యారాణి 11వ తేదీన ఉద్యోగానికి రిజైన్ చేసిందని, ఆపై ఆమె అక్కడికి రాలేదన్న సమాధానం రావడంతో అవాక్కయ్యారు.

ఆపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయడం ద్వారా ఎక్కడుందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News