Tamilnadu: తమిళనాడులో వేగంగా వెళుతూ అదుపు తప్పిన కారు.. నలుగురు విద్యార్థుల దుర్మరణం!

  • వేలూరులోని అంబూరు వద్ద ఘటన
  • చెట్టును ఢీకొన్న విద్యార్థుల కారు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తమిళనాడులోని వేలూరులో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి వేలూరు మండలంలోని అంబూరు వద్ద వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో వెళుతున్న నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు అంబులెన్సుతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయిందని చెప్పారు. చనిపోయిన నలుగురు విద్యార్థులు వేలూరు ఇస్లామియా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుతున్నారని వెల్లడించారు. కాగా, వాహనం నడిపినప్పుడు వీరు మద్యం సేవించారా? లేదా? అన్నది ఇంకా తేలలేదన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News