Tamilnadu: పెళ్లికి నో చెప్పిన మహిళ.. కోపంతో యాసిడ్ పోసిన యువకుడు.. ఆపై తానూ ఆత్మహత్య!

  • తమిళనాడులోని కన్యాకుమారిలో ఘటన
  • పిల్లలు ఉండటంతో వివాహానికి నిరాకరించిన మహిళ
  • పోలీసుల భయంతో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

తాను ప్రేమించిన మహిళ వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఓ వ్యక్తి రాక్షసుడిగా మారాడు. ఆమె జీవితాన్ని నాశనం చేసేందుకు యాసిడ్ తో దాడిచేశాడు. చివరికి పోలీసుల భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది.

ఇక్కడి తిరువట్టార్‌ సమీపంలో ఓ మహిళ(36) తన ఇద్దరు మైనర్ పిల్లలతో కలిసి ఉంటోంది. భర్త చనిపోవడంతో ఆమె పనిచేసుకుంటూ ఇద్దరు చిన్నారులను పోషించుకుంటోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన జాన్‌రోస్‌ (30)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకుందామని ఆమెకు జాన్ చెప్పాడు. అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారనీ, ఇప్పుడు వివాహం చేసుకోలేనని ఆమె తేల్చిచెప్పింది. దీంతో కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన జాన్ ఇంకోసారి సదరు మహిళ ఇంటికి వెళ్లి పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.

ఇందుకు ఆమె నిరాకరించడంతో జాన్ రాక్షసుడిగా మారిపోయాడు. తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ను ఆమెపై పోసి పరారయ్యాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు, బంధువులు ఆచ్చారిపల్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాన్ కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఈ విషయం తెలుసుకున్న జాన్ భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

More Telugu News