India: ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీకి కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలి!: అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్

  • మహాత్మాగాంధీ కంటే అంబేడ్కర్ గొప్పవారు
  • జాతీయ పార్టీల్లో యువత ఎదగలేరని వ్యాఖ్య
  • యువ నాయకత్వ సదస్సులో మజ్లిస్ చీఫ్

ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల్లో యువత ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి వేగవంతం అవుతుందని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తన ప్రసంగాలు విద్వేషపూరితంగా ఉన్నాయంటే అవి నలుగురిలో ఆలోచనలు రేకెత్తించడానికే అని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో మహాత్మాగాంధీ కంటే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ గొప్పవారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ఈరోజు ఒవైసీ మాట్లాడారు.

రాజకీయాల్లో యువత గణనీయంగా పెరగాలని ఒవైసీ అభిప్రాయపడ్డారు. అయితే జాతీయ పార్టీల్లో చేరితే యువత ఉన్నత స్థానాలకు ఎదగలేదని వ్యాఖ్యానించారు. యువత ప్రాతినిధ్యం పెంచేందుకు ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులుగా పోటీచేసేందుకు కనీస వయసును 20 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. తనకు 49 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా తనను యువ నాయకుడిగానే గుర్తిస్తున్నారంటూ సభికుల్లో నవ్వులు పూయించారు.

More Telugu News