bihar: మద్యం తాగి తాళి కట్టబోయిన వరుడు.. ఛీపో అంటూ పెళ్లిని రద్దు చేసుకున్న యువతి!

  • బిహార్ లోని తిలక్ పూర్ లో ఘటన
  • సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తున్న బిహార్
  • వరుడు, అతని తండ్రిని పట్టుకెళ్లిన పోలీసులు

ఒకప్పుడు అబ్బాయికి అమ్మాయి నచ్చిందని తెలియగానే ఆమె కుటుంబ సభ్యులు సంతోషంతో పొంగిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అయిపోయింది. అబ్బాయి ప్రవర్తన సరిగా లేకపోయినా, చెడు అలవాట్లు ఉన్నా పెళ్లి చేసుకోబోమని యువతులు మొహం మీదే చెప్పేస్తున్నారు. తాజాగా పెళ్లి మండపానికి పూటుగా మందు కొట్టి వచ్చినందుకు ఓ యువతి ఏకంగా పెళ్లినే క్యాన్సిల్ చేసుకుంది. ఈ ఘటన బిహార్ లోని భాగల్ పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

భాగల్ పూర్ లోని తిలక్ పూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి అదే ఊరికి చెందిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దవాళ్లు నిర్ణయించారు. ఇందుకోసం ఏర్పాట్లను పూర్తిచేసిన ఇరు కుటుంబాలు, ఆహ్వానపత్రికలు సైతం పంచేశాయి. తాను పెళ్లి కొడుకును అన్న గర్వమో, స్నేహితులు కోరారో తెలియదు కానీ వరుడు మాత్రం పూటుగా మందుకొట్టి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. తాళి కట్టే సమయంలో అతను మద్యం తాగాడని గమనించిన యువతి పెళ్లి పీటల నుంచి లేచింది.

ఇలాంటి వ్యక్తిని తాను పెళ్లి చేసుకోబోనని కరాఖండిగా చెప్పేసింది. అమ్మాయికి నచ్చజెప్పేందుకు ఇరు కుటుంబాల పెద్దలు యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి పీటలవరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇక్కడే అసలు కొత్త ట్విస్ట్ మొదలయింది. ప్రస్తుతం బిహార్ లో సంపూర్ణ మద్య నిషేధం అమలు అవుతున్న నేపథ్యంలో మందు తాగినందుకు వరుడితో పాటు అతడి తండ్రిని పోలీసులు ఎక్సైజ్ చట్టం కింద అరెస్ట్ చేశారు.

More Telugu News