Andhra Pradesh: జగన్ పై దాడి కేసు.. హర్షవర్ధన్ చౌదరి ఇల్లు, ఆఫీసుకు తాళం.. దొరకని ఆచూకీ!

  • ఈరోజు విచారించేందుకు వెళ్లిన ఎన్ఐఏ అధికారులు
  • తాళం వేసి వెళ్లిపోయిన హర్షవర్ధన్ చౌదరి కుటుంబం
  • వెనుదిరిగిన ఎన్ఐఏ అధికారులు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఉద్యోగం ఇచ్చిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి అధికారులు సమన్లు జారీచేయగా, తాను త్వరలోనే విచారణకు హాజరు అవుతానని హర్షవర్ధన్ అధికారులకు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో తాను కదలలేని స్థితిలో ఉన్నాననీ, కోలుకున్నాక త్వరలోనే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని చెప్పారు.

అయితే ఎన్ఐఏ అధికారులు విచారణ జరిపేందుకు ఈరోజు అకస్మాత్తుగా రెండు కార్లలో హర్షవర్ధన్ ఇల్లు, కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ ఇంటికి, ఆఫీసులకు తాళాలు వేసి ఉండటంతో అక్కడే ఆగిపోయారు. హర్షవర్ధన్ జాడ విషయంలో అధికారులు ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. దీంతో అతని ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

కాగా, గతేడాది అక్టోబర్ 25న జగన్ పై శ్రీనివాసరావు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో జగన్ చికిత్స చేయించుకున్నారు.

More Telugu News