AAP: మీ ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకే.. మీరు మాకిచ్చే బహుమానం అదే: శుభలేఖపైకి ఎక్కిన అభిమానం!

  • ‘ఆప్’‌కు ఓటేయాలంటూ శుభలేఖపై ముద్రించిన వధూవరులు
  • తమకిచ్చే గొప్ప బహుమతి అదేనన్న జంట
  • వైరల్ అవుతున్న శుభలేఖ

వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఓ జంట ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)పై తమకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకుంది. తమ పెళ్లి శుభలేఖలపై ఏకంగా ఆ పార్టీకే ఓటేయాలని ముద్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఆప్’కు ఓటేయడమే మీరు మాకిచ్చే అతిపెద్ద బహుమానమని పేర్కొన్నారు.

హరియాణాకు చెందిన జస్విందర్ సింగ్-ఇంద్రజిత్ కౌర్‌లు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వీరు తమ పెళ్లి శుభలేఖలపై ‘రానున్న లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. మీరు మా పెళ్లికి ఇచ్చే కానుక అదే’ అని ముద్రించారు. ఈ కార్డును ఆఫ్ సోషల్ మీడియా వ్యూహకర్త అంకిత్ లాల్ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

కాగా, ఆప్ అధికార ప్రతినిధి కుల్దీప్ కడ్యాన్ కూడా ఇటువంటిదే మరో ఆహ్వాన పత్రికను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ శుభలేఖలో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు గోపాల్ రాయ్, నవీన్ జైహింద్ చిత్రాలను ముద్రించారు. ఈ శుభలేఖను పోస్టు చేసిన ఆయన హరియాణాలోని చాలాచోట్ల ఇటువంటి పరిస్థితే ఉందని పేర్కొన్నారు.

More Telugu News