Goa: గోవాలో ఘోరం.. 15 ఏళ్ల బాలికపై ఆరు నెలలుగా యువకుడి అత్యాచారం

  • విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు
  • బంధువుల ఇంట్లో ఉంటున్న బాలిక
  • నిందితుడి అరెస్ట్

బాలిక (15)కు మాయమాటలు చెప్పి ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్న యువకుడిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మనస్పర్థల కారణంగా కొన్నాళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. దీంతో గోవా సమీపంలోని కనకోనా అనే గ్రామంలో వరుసకు అత్త అయ్యే బంధువుల ఇంట్లో బాలిక ఉంటోంది. ఆమెతో పరిచయం పెంచుకున్న సమీర్ విలిప్ (22) అనే యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.  

ఈ నెల 3న స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్టు అత్తకు చెప్పి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం గాలిస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమీర్‌తో తనకు ఆరు నెలలుగా శారీరక సంబంధం ఉందని బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు సమీర్‌ను అరెస్ట్ చేశారు.  

More Telugu News