KCR: తెలంగాణ స్పీకర్‌గా పోచారం ఫైనల్.. నేడు ప్రకటించనున్న కేసీఆర్

  • అనుభవం, బాగా మాట్లాడడంలో పోచారం నేర్పరి
  • ఆయనైతే సభను బాగా నడిపించగలరని అభిప్రాయం
  • ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ ప్రతిపక్ష నేతలకు కేసీఆర్ ఫోన్

తెలంగాణ స్పీకర్ ఎవరన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి (69) రాష్ట్రానికి రెండో స్పీకర్ కానున్నారు. సీఎం కేసీఆర్ ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి పోచారంతో మాట్లాడిన సీఎం.. నేడు ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. అంతేకాదు, నేడే ఆయనతో నామినేషన్ కూడా దాఖలు చేయించనున్నారు. చివరి క్షణంలో ఏమైనా మార్పులు సంభవిస్తే పద్మాదేవేందర్ రెడ్డి, లేదంటే ఇంద్రకరణ్ రెడ్డిలలో ఒకరితో నామినేషన్ వేయించనున్నారు.

అనుభవం, బాగా మాట్లాడడంలో నేర్పు ఉన్న పోచారం అయితే సభను సమర్థంగా నిర్వహించగలరన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఆయనవైపు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇప్పటికే ఆరుసార్లు ఎన్నికైన పోచారం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితే ఉంటే ఆయన కుమారుడికి సీటు ఇస్తానని కూడా సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేయాలంటూ ప్రతిపక్ష నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్లు చేసి విజ్ఞప్తి చేశారు. సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని కోరారు.

More Telugu News