delhi: దేశ రాజధానిలో.. జ్యూస్ లో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారం!

  • ఢిల్లీలో రెచ్చిపోతున్న కామాంధులు
  • యువతిపై అత్యాచారం చేసిన స్నేహితుడు, అతని మరో ఇద్దరు స్నేహితులు
  • నిందితుడిని విచారిస్తున్న పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో కామాంధులు మరో దారుణానికి ఒడిగట్టారు. నమ్మి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన నిన్న రాత్రి సమయంలో చోటు చేసుకుంది.

పోలీసు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... 'ఏడుస్తూ ఉన్న ఓ యువతి (25)ని అటువైపుగా వెళ్తున్న వారు గమనించారు. ఆ తర్వాత వారి సహకారంతో తూర్పు ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ కు చెందిన అమిత్ (30) బిజినెస్ చేస్తున్నాడు. బాధితురాలికి అతను స్నేహితుడు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా రెండు నెలల క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్ ఇప్పిస్తానని బాధితురాలిని అమిత్ నమ్మించాడు. లోను విషయమై మాట్లాడటానికి రావాలని నిన్న అమిత్ పిలిచాడు. ఆమె అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో అమిత్ తో పాటు అతని స్నేహితులు మరో ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా మత్తు మందు కలిపిన జ్యూస్ ను బాధితురాలికి ఇచ్చారు. కాసేపటి తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ముగ్గురూ కలసి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు'

బాధితురాలి ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అమిత్ ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు. 

More Telugu News