Uttar Pradesh: రేపిస్టులకు క్లీన్ చిట్ ఇచ్చిన పోలీసులు.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న వివాహిత!

  • ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో ఘటన
  • గతేడాది రేప్ చేసి వీడియో చిత్రీకరణ
  • బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అఘాయిత్యం

ఓ వివాహితపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి పలుమార్లు తమ మృగవాంఛను తీర్చుకున్నారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైన సదరు మహిళ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కేర్నాల్ గంజ్ ప్రాంతానికి చెందిన శంకర్ దయాల్, అశోక్ ఇదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై గతేడాది, ఆగస్టులో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసి పలుమార్లు బెదిరించి లైంగికదాడికి దిగారు. చివరికి వీరి వేధింపులు హద్దు దాటడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో యూపీ అసెంబ్లీ ముందు ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది.

దీంతో ఈ కేసును యూపీ పోలీసులు, క్రైం బ్రాంచ్ అధికారులు విచారణ చేబట్టారు. అయితే, గతేడాది డిసెంబర్ లో నిందితులకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి లోనైన సదరు మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై మృతురాలి భర్త మాట్లాడుతూ.. పోలీసులు సరైన రీతిలో విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించాడు.

అందుకే తన భార్య ఆత్మహత్య చేసుకుందని విలపించాడు. మరోవైపు ఈ విషయం మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ కేసును డీల్ చేసిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News