sharmila: షర్మిళ ఆరోపణలు చాలా దురదృష్టకరం.. ఖండిస్తున్నాం: టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్

  • అటువంటి నీచ సంస్కృతి టీడీపీకి లేదు
  • టీడీపీ, బాబుపై ఆమె ఆరోపణలను ఎవరూ నమ్మరు
  • అలాంటి  నీచ సంస్కృతి వైసీపీకే ఉంది

సామాజిక మాధ్యమాల ద్వారా తనపై దుష్ప్రచారం జరుగుతోందని తెలంగాణ పోలీసులకు వైసీపీ నాయకురాలు షర్మిళ ఫిర్యాదు చేయడంపై ఏపీ టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా జరిగే ఇలాంటి దుష్ప్రచారాలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి దుష్ప్రచారాలను ఎట్టిపరిస్థితుల్లోను తమ నాయకుడు చంద్రబాబు సహించరని అన్నారు.

ఇక షర్మిళపై దుష్ప్రచారం వెనుక టీడీపీ పార్టీ, చంద్రబాబుహస్తం ఉందని ఆమె ఆరోపించడం చాలా దురదృష్టకరమని అన్నారు. అటువంటి నీచ సంస్కృతి టీడీపీకి లేదని, అలాంటి సంస్కృతి వైసీపీకే వుందని దుయ్యబట్టారు. ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దని చంద్రబాబు తమకు కరాఖండిగా చెబుతారని, ఒకవేళ, పొరపాటున తాము ఎవరిపైన అయినా అలాంటి వ్యాఖ్యలు చేస్తే తమ నేతలను బాబు మందలించిన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు ఇలాంటి పనులు చేయిస్తారని షర్మిళ ఆరోపించడాన్ని ప్రజలెవ్వరూ నమ్మరని, అలాంటి సంస్కృతి ఆయనది కాదని అన్నారు.

More Telugu News