Jagan: నాకు, హీరో ప్రభాస్ కూ లింకా?: నిప్పులు చెరిగిన షర్మిళ

  • ఆన్ లైన్ లో దుష్ప్రచారం
  • ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి
  • సీపీని కలిసిన తరువాత షర్మిళ

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ జగన్ సోదరి షర్మిల మీడియా ముందు సవివరంగా మాట్లాడారు. "నాకు, ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్ కు సంబంధం ఉంది... అనే దుష్ప్రచారాన్ని ఆన్ లైన్ లో ఒక క్యాంపెయిన్ లాగా ఒక వర్గం నడిపింది. అప్పట్లో 2014 ఎన్నికల తరువాత, నేను ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విచారణ చేసి, పోలీసులు చర్యలు తీసుకున్న తరువాత, కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. కానీ, ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి గనుక, ఈ విష ప్రచారానికి మళ్లీ వేగం పెంచారు. వీళ్ల మోటివ్ ఒక్కటే. నా క్యారెక్టర్ అసాసినేషన్.

తప్పును తప్పు అని ఎత్తి చూపడానికి చట్ట ప్రకారం... ఈ ప్రచారాలను సృష్టిస్తున్నవారి మీద, వారి వెనకాల ఉన్న వారి మీదా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా నేను భావించడం లేదు. ఇలాంటి రాతలు, ఇంకెంతో మంది మహిళల మీద కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత శాడిజం, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా?

ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, సమానత్వం, ఉమెన్స్ లిబరేషన్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప పదాలు కాగితాలకు, చర్చలకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇవి వాస్తవ రూపం దాల్చాలంటే, మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజు... వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో ఈ ప్రచారాలకు వీలేలేకుండా, కఠిన చర్యలు తీసుకోవాలి అన్న నా కంప్లయింట్ కు మద్దతు పలకవలసిందిగా, ప్రజాస్వామ్య వాదులను, నైతికత ఉన్న రాజకీయ నాయకులను, జర్నలిస్టులను, మహిళలను కోరుతున్నాం" అని వైఎస్ షర్మిళ వ్యాఖ్యానించారు.

తనకు, హీరో ప్రభాస్ కు మధ్య ఏదో వివాహేతర బంధం ఉందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని ఈ ఉదయం హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసిన షర్మిళ, అనంతరం మీడియా ముందు చేసిన వ్యాఖ్యలివి.

More Telugu News