Tamilnadu: జల్లికట్టుకు రంగం సిద్ధం.. 2,600 ఎద్దులు, 3,400 మంది యువకులు!

  • తమిళనాట ప్రారంభమైన పొంగల్ వేడుకలు
  • జల్లికట్టుకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • తిలకించేందుకు తరలివచ్చిన ప్రజలు

తమిళనాడులో పొంగల్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తమిళులు ఉత్సాహంగా నిర్వహించుకునే జల్లికట్టు పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 64 చోట్ల పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోటీలు జరిపే బరులు ఉండాలని, పశువులను హింసించరాదని, వైద్యులు అందుబాటులో ఉండాలని పళనిస్వామి సర్కార్ ఆదేశించింది.

ఇక, జల్లికట్టు అత్యంత వైభవంగా జరిగే అవనియపురం, పాలమేడు, అనంగానల్లురు తదితర ప్రాంతాల్లో పశువులను కట్టడి చేసే యువత సాహసాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు చేరుకున్నారు. ఈ సంవత్సరం జల్లికట్టులో 2,600 ఎద్దులు పాల్గొంటుండగా, వాటిని అదుపు చేసేందుకు తాము సిద్ధమని 3400 మంది యువకులు తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

More Telugu News