Jana Sena: రైతులపై త్వరలో విధాన ప్రకటన విడుదల చేస్తా: పవన్ కల్యాణ్

  • ఫిబ్రవరి రెండో వారంలో ఈ విషయమై స్పష్టత ఇస్తా
  • ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ విఫలమయ్యాయి
  • పోరాటం చేస్తాం, పోటీ చేస్తాం 

రైతులపై త్వరలో విధాన ప్రకటన విడుదల చేస్తానని, ఫిబ్రవరి రెండో వారంలో ఈ విషయమై స్పష్టత ఇస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే నిమిత్తం పెదరావూరుకు వెళ్లిన పవన్ మాట్లాడుతూ, ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ విఫలమయ్యాయని విమర్శించారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, మార్పు కోసం వచ్చానని మరోసారి స్పష్టం చేశారు. వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేసినందుకే తాను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప పదవుల కోసం కాదని అన్నారు.

రాజకీయాల్లోకి వచ్చేందుకు తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టానని, ఒకప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండేవని, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. పోరాటమే తనకు తెలిసిన విద్య అని, 'పోరాటం చేస్తాం, పోటీ చేస్తాం' అని పవన్ పేర్కొనడంతో సభ చప్పట్లతో మార్మోగిపోయింది. కాగా, పెదరావూరులోని వ్యవసాయం క్షేత్రంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో జనసేన నేతలు పాల్గొన్నారు. జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కు చెందిన ఈ వ్యవసాయ క్షేత్రంలో పవన్ కలియ తిరిగారు.

More Telugu News