MS Dhoni: సిడ్నీ మైదానంలో 87 ఏళ్ల మహిళా అభిమానితో ధోనీ ముచ్చట్లు!

  • తనయుడితో కలసి స్టేడియానికి వచ్చిన ఎడిత్ కోచానెక్
  • ప్రాక్టీస్ తర్వాత ఆమె వద్ద కూర్చున్న ధోనీ 
  • గర్వంగా ఉందన్న వృద్ధ అభిమాని

తనను చూసేందుకు స్టేడియానికి వచ్చిన 87 ఏళ్ల మహిళా అభిమానిని కలిసిన ధోనీ ఆమెతో కాసేపు ముచ్చటించాడు. సిడ్నీ వన్డేకు ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న ధోనీని చూసేందుకు ఆస్ట్రేలియా అభిమాని ఎడిత్ కోచానెక్ తన కుమారుడు నార్మన్‌తో కలిసి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు వచ్చింది.

విషయం తెలిసిన ధోనీ.. ప్రాక్టీస్ అనంతరం ఆమెను కలిసి నవ్వుతూ పలకరించాడు. ఆమెతో చాలాసేపు కబుర్లు చెప్పాడు. తన ఫేవరెట్ క్రికెటర్‌ స్వయంగా పలకరించి తన పక్కన కూర్చోవడంతో ఆశ్చర్యపోయిన ఎడిత్ కాసేపు అలానే ధోనీని చూస్తూ కూర్చుంది. తన అభిమాన క్రికెటర్ ధోనీని చూసిన ఆనందం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించింది.

 ఈ సందర్భంగా ఎడిత్ మాట్లాడుతూ.. ధోనీని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. ఇది తనకు చాలా గర్వంగానూ, గొప్పగానూ ఉందని పేర్కొంది. కాగా, ఇదే మైదానంలో గతంలో ప్రాక్టీస్ చేస్తున్న ఆసీస్ క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ ప్రాక్టీస్‌ను కూడా ఎడిత్ దగ్గరుండి చూడడం గమనార్హం.

More Telugu News