Jammu And Kashmir: నగదు, నగల కోసం రాజ్ పుత్ గా వేషం మార్చిన ముస్లిం యువతి... పెళ్లి చేసుకుని పరార్!

  • తప్పుదారిలో నడుస్తుంటే, ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన తండ్రి
  • వివాహం తరువాత ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన వరుడు
  • నగదు తీసుకుని పారిపోతే, అరెస్ట్ చేసిన పోలీసులు

తప్పుదారిలో నడుస్తూ, ఇంటి నుంచి గెంటివేయబడిన ఓ ముస్లిం యువతి,  రాజ్ పుత్ గా మారిపోయి, ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో ప్రొఫైల్ పెట్టి, పెళ్లయిన తరువాత, నగదు, నగలతో ఉడాయించగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, జమ్ము కాశ్మీర్ నివాసి అహ్మద్ ముష్తాక్, తన కుమార్తె అనీషా వైఖరి నచ్చక, ఇంటి నుంచి వెళ్లగొట్టాడు.

ఆపై ఆమె, పంజాబ్ వెళ్లి, తనను రాజ్ పుత్ గా పేర్కొంటూ, ఓ వెబ్ సైట్లో ప్రొఫైల్ ఉంచింది. తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న రాజేష్ భాటియా అనే వ్యక్తి, ఆమె ప్రొఫైల్ నచ్చి సంప్రదించాడు. పెళ్లికి అనీషా అంగీకరించడంతో, వివాహం జరిపించారు. ఆపై రెండు వారాల తరువాత తన ఉద్యోగం నిమిత్తం రాజేష్ కుమారుడు విదేశాలకు వెళ్లాడు. ఆ వెంటనే ఎవరూ లేని సమయాన్ని చూసి, ఇంట్లోని నగలు, నగదు తీసుకుని అనీషా పారిపోయింది. దీంతో రాజేష్ పోలీసులను ఆశ్రయించగా, విచారించిన పోలీసులు, అమృతసర్ ప్రాంతంలో ఆమెను అరెస్ట్ చేశారు. గతంలో అనీషా పలువురిని ఇదే తరహాలో మోసం చేసిందని గుర్తించినట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News