Telangana: కార్పొరేట్ స్కూలు విద్యార్థిపై వార్డెన్ లైంగికదాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు!

  • తెలంగాణలోని ఆదిలాబాద్ లో ఘటన
  • బాలుడిపై మృగవాంఛ తీర్చుకున్న వార్డెన్
  • ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని హాస్టల్ నిర్వాహకులు

చిన్నారులను జాగ్రత్తగా కాపాడాల్సిన ఓ హాస్టల్ వార్డెన్ మృగంగా మారాడు. చిన్నపిల్లాడిపై అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలుడు హాస్టల్ నిర్వాహకులకు తెలియజేయగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గత మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జిల్లాలోని మావల మండలంలో ఉన్న ఎస్ఆర్ ప్రైం కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటున్న బాలుడు అక్కడే హాస్టల్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న వార్డెన్ బాలుడిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితుడు హాస్టల్ నిర్వాహకులు, తోటి విద్యార్థులకు తెలియజేశాడు. అయితే హాస్టల్ నిర్వాహకులు చర్యలు తీసుకోకపోవడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.

దీంతో స్కూలుకు చేరుకున్న తల్లిదండ్రులు యాజమాన్యం తీరుపై మండిపడ్డారు. విషయం తెలుసుకున్న మావల ఎస్సై ముజాహిద్ జరిగిన విషయమై బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదును స్వీకరించారు. అనంతరం కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News