Chandrababu: 19న కోల్‌కతాలో భారీ ర్యాలీ.. కీలక పాత్ర పోషించనున్న చంద్రబాబు

  • ర్యాలీకి హాజరుకానున్న పలువురు నేతలు
  • కేసీఆర్‌కు మమత ఆహ్వానం
  • ర్యాలీ అనంతరం ‘మహాకూటమి’కి రూపు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఈ నెల 19న కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. ఫరూక్ అబ్దుల్లా, తేజస్వీ యాదవ్, శరద్ పవార్, బాబూలాల్ మరాండీ తదితరులు కూడా హాజరుకానున్నారు.

ర్యాలీకి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మమత ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఈ ర్యాలీకి హాజరయ్యేందుకు సిద్ధంగా లేరని సమాచారం. అలాగే, మాయావతి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లు ర్యాలీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ర్యాలీకి హాజరు కానున్నట్టు సమాచారం.

కోల్‌కతా ర్యాలీ తర్వాత జాతీయ స్థాయిలో ‘మహాకూటమి’కి ఓ రూపు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మపోరాట సభకు ఈ నేతలందరినీ చంద్రబాబు ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కోల్‌కతా ర్యాలీ తర్వాత ఏపీలో పొత్తులపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News