Telangana: కేసీఆర్ కోసం కొత్త కార్లు.. మెర్సిడెజ్ బెంజ్ కు నో చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి!

  • ప్రడోస్, ఫార్చునర్ కార్లు వాడుతున్న కేసీఆర్
  • కొత్త కార్లకు మైన్ ప్రూఫింగ్ చేయించనున్న అధికారులు
  • త్వరలోనే కాన్వాయ్ లో చేరనున్న కొత్తకార్లు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన కేసీఆర్ కోసం కొత్త కార్లను కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకూ సీఎం కాన్వాయ్ లో టయోటా ల్యాండ్ క్రూజర్, ప్రడోస్, టయోటా ఫార్చునర్ కార్లను వాడేవారు. తాజాగా సీఎం కాన్వాయ్ కోసం మెర్సిడెజ్ బెంజ్ తో పాటు కొన్ని హైఎండ్ కార్లను కొనుగోలు చేయాలని ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు భావించారు. వీటివల్ల భద్రతను మరింత పటిష్టం చేయొచ్చని అనుకున్నారు. అయితే ఇందుకు తెలంగాణ సీఎం సుముఖత వ్యక్తం చేయలేదు.

కేసీఆర్ గజ్వేల్ లోని తన వ్యవసాయ క్షేత్రానికి తరచుగా వెళుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల రోడ్లను తట్టుకునేలా టయోటా కార్లను కొనాలని ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు నిర్ణయించారు. మొత్తం 7-10 కార్లను సీఎం కాన్వాయ్ లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ కార్లను కొనుగోలు చేశాక మైన్ ప్రూఫింగ్ చేయించనున్నారు. తద్వారా కాన్వాయ్ పై ఎలాంటి దాడులు జరిగినా తట్టుకోవడం వీలవుతుంది. ప్రస్తుతం కేసీఆర్ వాడుతున్న ప్రడో కారు ధర రూ.93 లక్షలు కాగా, ఫార్చునర్ కారు రూ.33 లక్షలుగా ఉంది.

More Telugu News