Telangana: అంబులెన్సును ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే ముగ్గురి దుర్మరణం!

  • రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ఘటన
  • అదుపు తప్పి అంబులెన్సును ఢీకొట్టిన కారు
  • కేసు నమోదుచేసిన పోలీసులు

వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ఒక్కసారిగా అంబులెన్సు మీదకు దూసుకెళ్లింది. కారు బలంగా ఢీకొట్టడంతో అంబులెన్సులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది.

ఇక్కడి రావిరాల ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్ 13 ఔటర్ రింగ్‌ రోడ్డుపై శంషాబాద్‌ నుంచి బొంగులూరు వైపు ఈరోజు తెల్లవారుజామున వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళుతున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి అధికారులకు సమాచారాన్ని అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

కాగా, కారు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News