Car accident: మంగళగిరి హైవేపై అగ్నికి ఆహుతైన కారు.. పరుగులు తీసిన ప్రయాణికులు

  • కారు ఇంజిన్ నుంచి మంటలు
  • క్షణాల్లోనే బుగ్గి అయిన కారు
  • క్షేమంగా బయటపడిన ఐదుగురు

విజయవాడ వెళ్తున్న ఓ కారు గుంటూరు సమీపంలో అగ్నికి ఆహుతైంది. మంగళగిరి జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. విజయవాడవైపు వెళ్తున్న మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, అందులోని నలుగురు ప్రయాణికులు కారును ఆపి కిందికి దిగి పరుగులు తీశారు. ఈ క్రమంలో డ్రైవర్ కాలికి స్వల్పంగా గాయాలయ్యాయి.

 చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే కారంతా వ్యాపించి బుగ్గి చేశాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో వంతెనపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఇంజిన్ నుంచి మంటలు చెలరేగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

More Telugu News