CBI: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా మళ్లీ మన్నెం నాగేశ్వరరావు

  • నాగేశ్వరరావుకి అదనపు బాధ్యతలు అప్పగింత
  • కొత్త డైరెక్టర్ ని నియమించే వరకూ మన్నెం కొనసాగింపు  
  • సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో పటిష్ట భద్రత

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దీంతో, సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావుని మళ్లీ నియమించారు. సీబీఐ కొత్త డైరెక్టర్ ని నియమించే వరకూ లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకూ నాగేశ్వరరావుకి ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, సీబీఐ కేంద్ర కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించిన అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఇలా చేసినట్టు సమాచారం. సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, సీబీఐలో డైరెక్టర్‌ గా ఉన్న ఆలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ గా ఉన్న రాకేశ్‌ అస్థానాల మధ్య విభేదాలు తలెత్తడంతో వారిద్దరిని బలవంతపు సెలవుపై  కేంద్రం పంపిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే ఒడిశా క్యాడర్‌ అధికారి మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌ గా నియమించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈరోజు సీబీఐ డైరెక్టర్ గా అలోక్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆయనపై ఉన్న ఆరోపణలను హైపవర్ కమిటీ పరిగణనలోకి తీసుకుని, ఆ పదవి నుంచి అలోక్ వర్మను తప్పించారు.

More Telugu News