Andhra Pradesh: ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నాం: సింగపూర్ మంత్రి ఈశ్వరన్

  • ‘వెల్ కమ్ గ్యాలరీ’ నిర్మాణం మరో దశ అభివృద్ధికి నాంది
  • అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో ఇది కీలకం 
  • ప్రభుత్వం ఏం తలపెట్టిందో ప్రపంచం దృష్టిలో పడుతుంది 

రాజధాని అమరావతిలో ‘వెల్ కమ్ గ్యాలరీ’ నిర్మాణం ద్వారా మరో దశ అభివృద్ధికి, ఏపీ, సింగపూర్ ప్రభుత్వాలకు ఇది కీలక అడుగుగా భావిస్తున్నామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పేర్కొన్నారు. ‘వెల్ కమ్ గ్యాలరీ’కి సీఎం చంద్రబాబు, ఈశ్వరన్ లు శంకుస్థాపన చేశారు. అనంతరం, ఈశ్వరన్ మాట్లాడుతూ, ఈ ‘వెల్ కమ్ గ్యాలరీ’ నిర్మాణం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయని, రాజధాని వైపు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడంలో ఇది కీలకంగా మారుతుందని, ఇక్కడ ఏం జరుగుతుందనేది, ప్రభుత్వం ఏం తలపెట్టిందో ప్రపంచం దృష్టిలో పడాలని అన్నారు. ఇప్పటికే జరిగిన అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడున్న అవకాశాలు అందరికీ తెలియాలని చెప్పారు.

‘వెల్ కమ్ గ్యాలరీ’కి ఉన్న మరో ప్రత్యేకత బహుళజాతి సంస్థల భాగస్వామ్యమని, ఒక్క సింగపూర్ నుంచే కాదు జపాన్, జర్మనీ నుంచీ సంస్థలు ముందుకొచ్చాయని ఈశ్వరన్ తెలిపారు. ‘వెల్ కమ్ గ్యాలరీ’లో దేశ, విదేశాలకు చెందిన వైవిధ్య సంస్థలు కొలువుదీరనున్నాయని వివరించారు. తామంతా రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నామని, సీఎం చంద్రబాబు ఆలోచనకు తగిన విధంగా అత్యుత్తమ ప్రమాణాలతో రాజధానిని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

More Telugu News