NTR: ఈ తరం యువత తప్పకుండా చూడాల్సిన చిత్రం ’యన్.టి.ఆర్’: మంత్రి పరిటాల సునీత

  • వృత్తి పట్ల  అంకిత భావం గురించి చాటి చెప్పింది
  • ఈ కథను చాలా బాగా తెరపైకి ఎక్కించారు
  • తన కుటుంబసభ్యులతో కలిసి ‘కథానాయకుడు’ చూసిన సునీత

ఈ తరం యువత తప్పక చూడాల్సిన చిత్రం ‘కథానాయకుడు’ అని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురంలో తన కుటుంబసభ్యులతో కలిసి ‘యన్.టి.ఆర్’ తొలి భాగం ‘కథానాయకుడు’ని ఆమె వీక్షించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, వృత్తి పట్ల ఎలాంటి అంకిత భావం, పట్టుదల ఉండాలో ఈ చిత్రం చాటిచెప్పిందని కొనియాడారు.

బాలకృష్ణ ఎన్నిరోజులు కష్టపడ్డారో తనకు తెలియదు కానీ, ఆ కథను చాలా బాగా తెరపైకి ఎక్కించారని అన్నారు. సినీ రంగంలో విజయం సాధించాలంటే దాని వెనుక ఎంత కష్టముంటుందన్న విషయాన్ని చాలా బాగా చూపించారని ప్రశంసించారు. పెద్దాయన ఎన్టీఆర్ ఏ విధంగా అయితే మాట్లాడేవారో అదే విధంగా ఈ చిత్రంలో బాలయ్య వాయిస్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా పరిటాల సునీత కేక్ కట్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

More Telugu News