lk advani: మోదీకి సపోర్ట్ చేయవద్దని అద్వాని చేతులు జోడించి నన్ను వేడుకున్నారు: కేఏ పాల్

  • నేను మద్దతు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని అయ్యారు
  • నా మద్దతు కోసం మోదీ ఎంతగానో వేడుకున్నారు
  • ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చడని అద్వాని నాతో చెప్పారు

క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన విషయాన్ని వెల్లడించారు. పార్టీ వ్యవహారాలను తెలియజేయడానికి విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను మద్దతు ఇవ్వడం వల్లే 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు.

'మీరు బీసీ, నేను బీసీ... మీకు కుటుంబం లేదు, నాకు కుటుంబం లేదు... దేశమే మన ఇద్దరికీ కుటుంబం' అని తనతో మోదీ చెప్పారని కేఏ పాల్ వెల్లడించారు. 45 నిమిషాల సేపు మోదీ తనతో చర్చించారని... ఇద్దరం కలసి దేశాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పారని అన్నారు. తన మద్దతు కోసం ఎంతగానో వేడుకున్నారని... ఒక చిన్న కుర్రాడిలా మోదీ ప్రవర్తించారని చెప్పారు.

అయితే అద్వాని మాత్రం మోదీకి సపోర్ట్ చేయవద్దని తనకు చెప్పారని పాల్ తెలిపారు. 2013 అక్టోబర్ 1న గంటన్నర పాటు చేతులు జోడించి అద్వానీ తనను వేడుకున్నారని... మోదీకి మద్దతు పలకవద్దన్నారని... ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చడని చెప్పారని అన్నారు. మోదీ ఇంటికి తాను వెళ్లలేదని... ఆయనే తన వద్దకు వచ్చారని చెప్పారు. అద్వాని ఇంటికి మాత్రం తానే వెళ్లానని... తనను అద్వాని ఇంటికి ఆహ్వానించారని తెలిపారు. 

More Telugu News