Jagan: పాదయాత్ర ముగిసిందిగా... ఇక కాశీయాత్ర చేసుకో: జగన్ పై దేవినేని సెటైర్

  • పాదయాత్ర ఓ నాటకం
  • కాశీ చేరితే మోదీ తోడవుతారు
  • మీడియాతో దేవినేని ఉమ

పాదయాత్ర నాటకాన్ని ముగించిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవాలంటూ ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. కాశీకి వెళితే జగన్ కు స్నేహితుడైన నరేంద్ర మోదీ కూడా తోడవుతారని సెటైర్ వేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించారు.

జగన్‌ చేసిన ఆరోపణలు సత్యదూరమని, ఆయన వ్యాఖ్యల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుంటే, జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధిపై ఒక్క మాటైనా మాట్లాడని జగన్, ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో ఉన్నట్టు అర్థమవుతోందని అన్నారు. జగన్‌ ప్రసంగంలో నిరాశ, నిస్పృహ తనకు స్పష్టంగా కనిపించాయని, నరేంద్రమోదీ, కేసీఆర్ లతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నిన్న జరిగిన సభ పాదయాత్రకు ముగింపు కాదని, వైకాపాకే ముగింపు పలికే యాత్రని ఎద్దేవా చేశారు.

More Telugu News