Petta: గొడవపడి కత్తులతో పొడుచుకున్న రజనీ, అజిత్ అభిమానులు!

  • నేడు విడుదలైన రెండు చిత్రాలు
  • తమిళనాడులో పలు ప్రాంతాల్లో గొడవలు
  • వేలూరులో నలుగురికి తీవ్రగాయాలు

ఈ ఉదయం రజనీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' భారీ ఎత్తున విడుదల కాగా, తమిళనాడులోని వేలూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు సినిమాలూ పక్కపక్క థియేటర్లలో ఆడుతుండటంతో, భారీ ఎత్తున తరలివచ్చిన రజనీకాంత్, అజిత్ అభిమానులు గొడవపడ్డారు.

తొలుత వాగ్వాదంతో ప్రారంభమైన ఘర్షణ, ఆపై కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అభిమానులను చెదరగొట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మరోవైపు మధురై ప్రాంతంలోనూ అభిమానుల మధ్య గొడవ జరిగింది. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ లో 'విశ్వాసం' కన్నా ముందు 'పేట' ప్రారంభం కావడంతో అజిత్ అభిమానులు వీరంగం సృష్టించారు.

More Telugu News