Shiv Sena: చేతకానప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు చేర్చారు?: బీజేపీపై విరుచుకుపడిన ఉద్ధవ్ థాకరే

  • కరవు ప్రాంతాల్లో పర్యటించిన ఉద్ధవ్ థాకరే
  • ప్రభుత్వం తొలుత రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలి 
  • తాను జన్‌కీ బాత్ మాత్రమే వింటానన్న శివసేన చీఫ్ 

శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరోమారు విరుచుకుపడ్డారు. తాను రైతుల సమస్యలకే ప్రాధాన్యం ఇస్తానని తేల్చి చెప్పారు. కరవుతో అల్లాడుతున్న మూడు మరాఠ్వాడా జిల్లాల్లో పర్యటించిన ఆయన  రైతులతో మాట్లాడారు. కూటమి గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం తొలుత రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థ మన్నుతిన్న పాములా తయారైందని, దానిని తట్టి లేపాల్సిన అవసరం ఉందని అన్నారు.

తనకి ‘మన్‌కీ బాత్’ అవసరం లేదని, తాను ‘జన్‌కీ బాత్’నే వింటానని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకుండా తమతో కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. రైతు సమస్యలు, రామ మందిర నిర్మాణం వంటి వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విపలమైందన్నారు. కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను ఎందుకు ఇచ్చారని బీజేపీని సూటిగా ప్రశ్నించారు.  

More Telugu News