Karnataka: కాంగ్రెస్ తో వేగలేకపోతున్న కర్ణాటక సీఎం కుమారస్వామి.. ఏడ్చినంత పనిచేసిన ముఖ్యమంత్రి!

  • రోజులు కష్టంగా గడుస్తున్నాయి
  • కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు
  • వేరే దారిలేకే వారు చెప్పినట్టు చేస్తున్నా

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ తీరు తనను తీవ్రంగా బాధిస్తోందని, సీఎంలా కాకుండా ఓ క్లర్కులా పనిచేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేసినట్టు జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తెలిపారు. సీఎం ఏడ్చినంత పనిచేశారని, ఆయనతో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని తమతో చెప్పినట్టు తెలిపారు.

రోజులను ఆయన కష్టంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. వేరే దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వస్తోందని సీఎం తమతో చెప్పారని వివరించారు. కేబినెట్‌ను విస్తరించాలంటూ కాంగ్రెస్ నేతలు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెబుతూ సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే, ఈ విషయంలో వేచి చూసే ధోరణితో వ్యవహరిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సూచించినట్టు తెలుస్తోంది.

More Telugu News