Andhra Pradesh: రామ్ గోపాల్ వర్మ ‘ఎందుకు?’ పాటపై స్పందించిన లక్ష్మీపార్వతి!

  • పాట వినగానే బాధగా అనిపించింది
  • నా కులం, ఊరుపై తప్పుడు ప్రచారం చేశారు
  • మీడియాతో మాట్లాడిన లక్ష్మీపార్వతి

నట సార్వభౌమ ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెన్నుపోటు పాటను గతంలో విడుదల చేసిన వర్మ.. నిన్న సాయంత్రం 'ఎందుకు?'  అంటూ సాగే రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటపై అన్నివర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి ఈరోజు మీడియాతో మాట్లాడారు.

వర్మ విడుదల చేసిన ఎందుకు? అనే పాట తనకు బాధ కలిగించిందని లక్ష్మీపార్వతి తెలిపారు. రామ్ గోపాల్ వర్మ ఈ పాటలో తనను విమర్శించినట్లు అనిపించిందని వ్యాఖ్యానించారు. అయితే పాట చివరిలో మాత్రం ఇవన్నీ ప్రశ్నలేనని వర్మ చెప్పారన్నారు. టీడీపీ నేతలు అప్పట్లో తన కులం తనది కాదనీ, తన ఊరు నిజంగా తన సొంతూరు కాదని తప్పుడు ప్రచారం చేశారని లక్ష్మీపార్వతి విమర్శించారు.

తాను ఎన్టీఆర్ భార్యను కాదనీ, అసలు ఆయన తనను పెళ్లే చేసుకోలేదని 20 ఏళ్లుగా దుష్ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బయోపిక్ అంటే సుఖంగా ఉండటమే కాదనీ, ఆయన పడిన కష్టాలు, బాధలను చూపించాలని స్పష్టం చేశారు. సినిమాల్లోకి రాకముందు సైతం ఎన్టీఆర్ కష్టాలు పడ్డారని వ్యాఖ్యానించారు.

More Telugu News