co operative elections: తెలంగాణలో సహకార సంఘాల ఎన్నికలకు బ్రేక్‌.. లోక్ సభ ఎన్నికల తర్వాతే!

  • ఈనెల 17న నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది
  • రాష్ట్ర ప్రభుత్వం తుది ఉత్తర్వులిచ్చే వరకు లేనట్టే
  • సహకార శాఖకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో సహకార శాఖ ఎన్నికలకు బ్రేక్‌ పడినట్టే. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వకూడదని సహకార శాఖకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ఫ్యాక్స్)కు ఎన్నికలు నిర్వహించాలని తొలుత భావించారు. ఈ మేరకు ఈనెల 17వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవుతుందనుకున్నారు.

  ప్యాక్స్‌ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితా కూడా రూపొందించుకున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్యాక్స్‌కు ఎన్నికలు ముగియగానే అదే నెల 25వ తేదీ కల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌, టెస్కాబ్‌ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా సంకేతాలు కూడా ఇచ్చారు. ఈలోగా ఏమయిందోగాని ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

ఎన్నికల సమయంలో ఆశావహులతో బాగా పనిచేయించుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయన్నది టీఆర్‌ఎస్‌ ఉద్దేశంగా తెలుస్తోంది. ఎంపీ టికెట్‌ ఆశించి భంగపడిన వారికి డీసీసీబీ చైర్మన్‌ పదవి కట్టబెట్టి సంతోషపెట్టవచ్చని, దీనివల్ల లోక్‌సభ ఎన్నికల్లో నెగెటివ్‌ సమస్య ఉండదన్న ఆలోచన కూడా ప్రభుత్వం మదిలో ఉన్నట్లు సమాచారం.

More Telugu News